రణబీర్ కపూర్- సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘రామాయణం’ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రైమ్ ఫోకస్తో కలిసి రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇబ్బందుల్లో పడిందని జూమ్ మీడియా కథనం వెలువరించినట్టు ప్రఖ్యాత టైమ్స్ నవ్ పోర్టల్ వెల్లడించింది. అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్ఎల్పి పబ్లిక్ నోటీసును జారీ చేసింది. తమ ‘ప్రాజెక్ట్ రామాయణం’ ఆధారంగా స్క్రిప్ట్ని ఉపయోగించుకుంటూ ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ‘ప్రాజెక్ట్ రామాయణం’ మేధో సంపత్తి హక్కులను పొందేందుకు చర్చలు ప్రారంభించిందని, అయితే చెల్లింపు నిబంధనలను ఇంకా నెరవేర్చలేదని సదరు కథనం పేర్కొంది.
ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ‘ప్రాజెక్ట్ రామాయణం’లోని ఏదైనా కంటెంట్ని ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అల్లు మంతెన మీడియా వెంచర్స్ ప్రకటించినట్టు సదరు కథనం పేర్కొంది. ”ఈ అసైన్మెంట్ అగ్రిమెంట్ కింద అసైన్మెంట్ అమలులోకి రావడానికి ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన చెల్లింపులు ఏవీ అందలేదు. దీనివల్ల ప్రాజెక్ట్ రామాయణంలో హక్కులు మాకు మాత్రమే చెందుతాయి. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్కు సినిమా తీసే హక్కు లేదు” అని పేర్కొన్నట్టు టైమ్స్ నవ్ కథనం వెల్లడించింది. మా స్క్రిప్ట్ లేదా మెటీరియల్ ఉపయోగం అంటే దోపిడీగా పరిగణించబడుతుంది.