టీఎస్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిజాం సాగర్ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ లోకి నీరు వచ్చి చేరింది. మధ్య రాత్రి వేళ ఒక్కసారిగా నీరు ఇండ్ల లోకి రావడంతో కాలనీ వాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. అయితే కాలువ తెగి పోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటి పారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది. అయితే ఆర్మూర్ ప్రాంతం లోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో, ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండి పోయింది. కాగా, ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువ లోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు..