Friday, May 17, 2024

పంట నష్టంపై నివేదిక తయారు చేయండి

  • పంట నష్టంపై నివేదిక తయారు చేయండి
  • రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయి
  • కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
  • పంటనష్టం జరిగిన జిల్లాలో అధికారులు పర్యటించాలి
  • అధికారులను ఆదేశించిన
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. పంట నష్టపోయిన అన్నదాతల వివరాలు నివేదిక తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని, పంట కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని మంత్రి తుమ్మల తెలిపారు. తాజాగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల ప్రభావం, సంభవించిన పంట నష్టంపై మంత్రి ఆరా తీశారు. దాదాపు 2,200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని ఆయన తెలిపారు. పంట నష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన రైతుల వివరాలు వెంటనే సేకరించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

రెండు, మూడు వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలి

అంతేకాకుండా వరి పంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇలాంటి అకాల వర్షాలు సంభవించే సందర్భంలో పంట నష్టం తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కర్షకులకు సూచించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పంట కొనుగోలు కేంద్రాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలిలని, రైతులకు కావాల్సిన సౌకర్యాలు అందించాలని అధికారులకు మంత్రి- తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకెపి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం బస్తాలు, ఇతర పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇందుకోసం రైతుల సౌకర్యార్థం ఇప్పటికే 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని మంత్రి పేర్కొన్నారు.

శనివారం కురిసిన వర్షాలకు మరో 920 ఎకరాల్లో పంటనష్టం

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో వడగండ్లు, గాలి,వానలతో నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా శనివారం కురిసిన అకాల వర్షాలకు మరో 920 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాలో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలకు పంటనష్ట పరిహారం విడుదల చేయుటకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం కొరకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఎన్నికల సంఘాన్ని మరోసారి సంప్రదించి నిధుల విడుదలకు అనుమతులు పొందేలా ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular