Sunday, May 19, 2024

ప్రచారం ఎప్పుడు ప్రారంభిస్తారు..?

  • ప్రచారం ఎప్పుడు ప్రారంభిస్తారు..?
  • అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లాలి నిర్లక్షం వీడాలి…
  • కొందరు అభ్యర్థులు ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడంపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆగ్రహం
  • బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
  • అసెంబ్లీ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకోవద్దు మెజార్టీని పెంచుకోవాలని ఆదేశం
  • ఓటింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలి 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నోవాటెల్ (శంషాబాద్) హోటల్‌లో ఆదివారం సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 17 లోక్‌సభ స్థానాల నియోజకవర్గ ఇన్‌చార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అభ్యర్థుల బలాబలాలు, ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడంపై కెసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఎన్నికల ప్రచారాన్ని త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించినట్టుగా తెలిసింది. ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించలేదు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎందుకు వెనుకబడ్డారని కెసి వేణుగోపాల్ అభ్యర్థులను ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన నివేదికను తెప్పించుకుంటామని ప్రతి ఒక్కరూ గెలుపుకోసం కృషి చేయాలని కెసి సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు 10 ఏళ్లలో ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ వారితో పేర్కొన్నట్టుగా సమాచారం.

కష్టపడి మెజార్టీని పెంచుకోవాలి

కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అంశాల గురించి కెసి వివరించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై వేణుగోపాల్ స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రకటించిన 14 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటీ? వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. దీంతోపాటు పలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు ఏఐసిసి అగ్రనేతలు వస్తారని దానికి సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి చేపట్టాల్సిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ వస్తుందన్న అంచనాతో అభ్యర్థులు ఉండవద్దని ఈసారి కూడా కష్టపడి మెజార్టీని పెంచుకోవడానికి అభ్యర్థులు కృషి చేయాలని, దీనికోసం అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా ప్రతి ఇంటికి తిరగాలని అభ్యర్థులకు కెసి వేణుగోపాల్ సూచించారు.

దీపాదాస్ మున్షీతో కెసి వేణుగోపాల్ ప్రత్యేక సమావేశం

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మినహా అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ మూడు సీట్లకు సంబంధించి దీపాదాస్ మున్షీతో కెసి వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయినట్టుగా తెలిసింది. గతంలో ఆ మూడు జిల్లాల కాంగ్రెస్ నాయకులతో ఏఐసిసి నాయకుడు భేటీ అయి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న దానిపై ఆయా జిల్లాల నాయకుల అభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. ప్రస్తుతం వీటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసుకొని రెండు రోజుల్లో ఏఐసిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

బహిరంగ సభలకు ఏఐసిసి అగ్రనేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్ సభ సీట్లను ఎక్కువ గెలుచుకోవాలన్న లక్షంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడకు పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడంతో పాటు వారితో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అగ్రనేతలతో పాటు ఏఐసిసి నాయకులు సుడిగాలి పర్యటన చేయనున్నట్టుగా కెసి వేణుగోపాల్ అభ్యర్థులతో తెలిపారు. వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రెండు భారీ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో ఒకే రోజు జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ హాజరవుతారని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. దీనికితోడు ఏఐసిసికి చెందిన ముఖ్యనేతలు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular