-
పీవోకేను పాకిస్తాన్కు అప్పగిస్తామా..?
-
బీజేపీ ఉన్నంత కాలం అసాధ్యం
-
సర్జికల్ దాడులు చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదు
-
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
టీఎస్, న్యూస్ :
కాంగ్రెస్కు సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం లేదని, బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం మన దేశంపై ఏ ఉగ్రవాది కన్నెత్తి చూడడని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వారిద్దరు మజ్లిస్కు, వారి ఓటు బ్యాంకుకు భయపడుతున్నారని మండిపడ్డారు.
శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దగ్గర అటమ్ బాంబు ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యరు భయపెడుతున్నాడని, బాంబు ఉందని పీవోకేను పాకిస్తాన్కు అప్పగిస్తామా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఉన్నంత కాలం పీవోకేను పాకిస్తాన్కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదని, కశ్మీర్ మనదే.. పీవోకే మనదే అని నినదించారు. దేశంపై ఎవరైనా కన్నెత్తి చూసేందుకు వణుకుతున్నారని, ఒక్కసారి దేశంవైపు వస్తే.. సర్జికల్ దాడులు చేసి.. పాకిస్తాన్ దాక్కుని ఉన్న ఉగ్రవాదులను ముట్టబెట్టామని, అది బీజేపీ ధైర్యమని, సర్జికల్ స్ట్రైక్ లు వాళ్ల దేశానికి వెళ్లి చేయడం కాంగ్రెస్కు సాధ్యమవుతుందా.. అని నిలదీశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా.. వాళ్లను రక్షించే వాళ్లు కావాలా.. అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని పేర్కొన్నారు. కొంచం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదని షా అన్నారు.
రామమందిరం నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడిందని, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదని అమిత్ షా ప్రశ్నించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయంతో రాలేదన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తివేస్తామని షా ప్రకటించారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి, ఢిల్లీకి డబ్బుల సంచులు చేరవేస్తున్నారని ఆరోపించారు.కాగా, త్వరలో వికారాబాద్కు బుల్లెట్ ట్రైన్ వస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.