Sunday, May 5, 2024

కాంగ్రెస్‌లో చేరికల కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

  • బిఆర్‌ఎస్, బిజెపి నాయకుల చేరికపై కాంగ్రెస్ కేడర్ అసంతృప్తి
  • కేడర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని టిపిసిసిని ఆదేశించిన ఏఐసిసి

కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరికలు భారీగా పెరగడంతో ఏఐసిసి కమిటీని ఏర్పాటు చేసింది. హస్తం పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసం, భావ సారూప్యత కలిగిన నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిలతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై వీరి ఆమోదంతోనే చేరికలు ఉండేటట్లు చూడాలని పిసిసి నిర్ణయించింది. అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో చేరేందుకు చొరవ చూపుతున్నారు. ఇటీవల కెసి వేణుగోపాల్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చేరికల విషయం చర్చకు వచ్చింది. ఎవరు పార్టీలో చేరేందుకు చొరవ చూపినా ఆహ్వానించాలని ఆయన సూచించారు. అయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో గడిచిన పదేళ్లుగా క్షేత్రస్థాయిలో హస్తం పార్టీకి అండగా ఉంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు ఎదురొడ్డి కొట్లాడిన కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

స్థానిక కాంగ్రెస్ నేతల ఆమోదముద్ర లేకుండా
ఇప్పటివరకు అప్పటి అధికార పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఎదుర్కొన్న పార్టీ శ్రేణులు, చోటా నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో కలిసి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన నేతలు కాంగ్రెస్‌లో చేరితే కలిసి పనిచేయడం ఎలా సాధ్యమని వారు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసమో, ఆస్తుల రక్షణ కోసమో బిఆర్‌ఎస్, బిజెపికి చెందిన మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హస్తం పార్టీలోకి వస్తున్నారు. అయితే డిసిసి అధ్యక్షులకు తెలియకుండానే స్థానిక కాంగ్రెస్ నేతల ఆమోదముద్ర లేకుండా కొంతమందిని చేర్చుకుంటూ ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
కాంగ్రెస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేలా ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో కమిటీని ఏఐసిసి ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు పార్టీకి విధేయత చూపి, భావ సారూప్యత కలిగిన నాయకులను మాత్రమే చేర్చుకోవాలని ఏఐసిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కష్ట కాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో నాయకుల అంగీకారంతో చేర్చుకునే దిశగా పిసిసి చొరవ చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు పిసిసి వెల్లడించింది. ఇకపైన ఎవరిని పార్టీ చేర్చుకోవాలన్నా పూర్తిస్థాయిలో చర్చించి స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పిసిసి నిర్ణయించింది.
Tags: Congress cadre, inclusion, BRS, BJP leaders, sonia gandhi, rahul gandhi

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular