Sunday, May 19, 2024

రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

  • మే 1వ తేదీన విచారణకు హాజరుకావాలని
  • సిఎం రేవంత్‌కు సమన్లు
  • విచారణకు వచ్చేటప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వినియోగించిన
  • ఎలక్ట్రానిక్ డివైస్‌లను తీసుకురావాలని ఆదేశం

రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా మాట్లాడుతున్న ఓ ఫేక్ వీడియో చేసినందుకు ఢిల్లీ పోలీసులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో పాటు డిజిపి, సిఎస్‌లకు కూడా నోటీసులు పంపారు. అమిత్ షా వీడియో ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు తెలంగాణ బిజెపి నేతలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోను ఎడిట్ చేసి తెలంగాణ పిసిసి అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్ అకౌంట్‌లో పోస్ట్ చేశారని బిజెపి నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జీలు మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమలకు సైతం సీఆర్పీసీ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఇదే కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయన్ను ఆదేశించారు. విచారణకు వచ్చేటప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైస్‌లను తీసుకురావాలని పోలీసులు కోరారు.

వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్
అమిత్ షా తెలంగాణలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబిసిల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే బిజెపి మాత్రం అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్లు బిజెపి స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular