ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
టీఎస్, న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారిగా వ్యవహరించి, విదేశాల్లో దాకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెడ్ కార్నర్ నోటీస్ కోసం కోర్టు అనుమతి కోరామన్నారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో నిందితులు ఆధారాలు దొరక్కుండా ఎంత ధ్వంసం చేసినా సరే, తాము కష్టపడి కీలక ఆధారాలను సేకరించామని ఆయన చెప్పారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
సోమవారం హైదరాబాద్ లో మీడియాతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్ పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులను నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామని, వారు కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చారని ఆయన తెలిపారు. వాళ్ళ వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. వీయిడో ఎక్కడ క్రియేట్ చేశారని అనేదానిపై సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపించామన్నారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను సంప్రదించి, ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను అడిగారన్నారు. ఈ క్రమంలో వారికి కావాల్సిన వివరాలను అందజేశామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందన్నారు.