Friday, May 17, 2024

చెరుకు రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

  • చెరుకు రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
  • త్వరలోనే తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలు
  • చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను వన్ టైమ్
  • సెటిల్‌మెంట్ కింద చెల్లించేందుకు బ్యాంకర్లతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • సిఎం రేవంత్‌రెడ్డి చర్యలతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
  • వన్ టైమ్ సెటిట్‌మెంట్ కింద రూ.43 కోట్లు విడుదల

చెరుకు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది. అందుకు బ్యాంకర్లు సమ్మతించటంతో ఫ్యాక్టరీల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వన్ టైమ్ సెటిట్‌మెంట్ కింద రూ.43 కోట్లు విడుదల చేసింది. మూతపడ్డ చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలో జనవరిలోనే మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై ఈ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపింది. బకాయిల చెల్లింపులకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం ఇవ్వాలని బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది. సెప్టెంబర్ 17వ తేదీలోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లను విడుదల చేయడంతో త్వరలోనే మూత పడ్డ చక్కెర ఫ్యాక్టరీలు తెరిచేందుకు మార్గం సుగమమైంది. మెతుకు సీమకు అన్నం పెట్టే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభం కానుందని తెలియడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తుంది.

1987లో ప్రారంభం

మెతుకు సీమ మెదక్ చెరుకు పంటకు ఎంతో ప్రసిద్ధి. కాగా, ఇంతకు ముందు ఇక్కడి రైతులు చెరుకు పంట పండించేవారు. 1987లో మెదక్ మండలం, మంభోజిపల్లి గ్రామ శివారులో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పట్లోనే కొన్ని వేల ఎకరాల్లో చెరుకు పంట ఎక్కువ సాగు చేసేవారు రైతులు. నిజాం ఫ్యాక్టరీకి మంచి లాభాలు లభించేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని షుగర్ ఫ్యాక్టరీలకు నష్టాలు రావడంతో ఆ ప్రభావం తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలపై చూపింది. మెదక్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటినుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

2002ల సంవత్సరంలో ప్రైవేటీకరణ

రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా బోధన్ సమీపంలోని శంకర్ నగర్, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలు 2002 సంవత్సరం వరకు బాగానే నడిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించింది. జాయింట్ వెంచర్‌గా ఫ్యాక్టరీలను నిర్వహించేందుకు డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి అప్పగించింది. 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభా సంఘం ఫీల్ విజిట్ చేసింది. ఫ్యాక్టరీల స్థితిగతులు పరిశీలించి, చెరుకు రైతులు, కార్మికులతో మాట్లాడింది. ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దుచేసి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో నివేదిక సమర్పించింది. అయితే అది అప్పటి నుంచి అమలుకు నోచుకోలేదు. కార్మికులు నడిరోడ్డున పడ్డారు. కార్మికులతో పాటు రైతులు సైతం నిజాంసాగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీను తెరిపిస్తామని హామీ ఇవ్వడంతో మెదక్ జిల్లా ప్రాంతంతో పాటు రైతులు, కార్మికులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

తుప్పుపట్టిన మెషినరీ..కార్మికుల వలసబాట

ముడిసరుకు, నీటి కొరతతో ఫ్యాక్టరీలు నడపలేని పరిస్థితి ఉందని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్‌ఎల్) మేనేజ్‌మెంట్ బోర్డు 2015 డిసెంబర్23న లే ఆఫ్ ప్రకటించింది. దీంతో మెట్‌పల్లి, శంకర్‌నగర్, మంబోజిపల్లి ఫ్యాక్టరీ యూనిట్లు మూతపడ్డాయి. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్డీఎస్‌ఎల్) తీర్పు ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. మూతపడి ఎనిమిదేళ్లు అవుతుండడంతో వినియోగంలో లేక ఫ్యాక్టరీల్లోని మెషినరీ తుప్పుపట్టి పోయింది. పెద్ద పెద్ద గోడౌన్లు వృథాగా మిగిలాయి. ఉద్యోగులు, కార్మికులు నివసించేందుకు నిర్మించిన బంగ్లాలు, క్వార్టర్లు, గెస్ట్‌హౌజ్‌లు శిథిలమవుతున్నాయి. ఫ్యాక్టరీ ఆవరణలో తుమ్మ చెట్లు మొలిచి చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి. సుమారు రూ.500 కోట్లకు పైగా విలువైన వందలాది ఎకరాల భూములు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఫ్యాక్టరీలు మూతపడడంతో ఉద్యోగాలు పోయి, ఉపాధి దొరక్క ఎంతోమంది కార్మికులు బతుకు దెరువుకోసం వలస బాట పట్టారు. మనోవేదనతో కొందరు కార్మికులు గుండెపోటుతో, మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకు ప్రచారస్త్రంగా….

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెదక్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్, బిజెపిలకు ఈ అంశం ప్రచారాస్త్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీలు ఇచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం సిఎం రేవంత్ ఆ దిశగా చర్యలు చేపట్టడం సంతోషకరమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular