- కమిషన్ను మర్యాద పూర్వకంగా కలిసిన
- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని
- కమిషన్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
కాళేశ్వరం అవకతవకలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పి. చంద్రఘోష్ కమిషన్తో ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై కమిషన్ విచారణ ప్రారంభం కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రఘోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కమిషన్ అడిగిన వివరాలు, కమిషన్కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయని ఉత్తమ్కుమార్ స్పష్టం చేశారు.
మర్యాద పూర్వకంగా కలిశా….
అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ జస్టిస్ చంద్ర ఘోష్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడిషియల్ విచారణ చీఫ్ జస్టిస్గా చంద్రఘోష్ ఉన్నారన్నారు. మేడిగడ్డ నిజానిజాలు తేల్చడానికే ప్రభుత్వం కమిషన్లు వేసిందన్నారు. చంద్రఘోష్ లీగల్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ మొదలైందన్నారు. ఎన్డీఎస్ఏ నుంచి మరో నాలుగైదు రోజుల్లో తాత్కాలిక నివేదిక వస్తుందని ఆయన చెప్పారు. మేడిగడ్డ అంశంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే కార్యాచరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అవకాశం ఉంటే బ్యారేజీలకు మరమ్మతులు చేసి వచ్చేన్లో ఉపయోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామన్నారు.
ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తా: జస్టిస్ చంద్రఘోష్
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ గురువారం ప్రారంభమైంది. వారికి కేటాయించిన బిఆర్కె భవన్లో కమిషన్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావులు హాజరయ్యారు. మేడిగడ్డపై కమిషన్కు నోడెల్ టీం పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. మేడిగడ్డకు సంబంధించిన డాక్యుమెంట్ను కమిషన్కు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ సందర్భంగా చంద్రఘోష్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరంపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని విచారిస్తామన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇంజనీర్లు, ఎన్డీఎస్ఏ అథారిటీతోను సమావేశం అవుతామని, టెక్నికల్ అంశాలను పరి గణలోకి తీసుకొని విచారిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Tags: Inquiry,Kaleshwaram, irregularities,Former Supreme Court Justice, P. Chandraghosh, Commission, uttam kumar reddy