నల్లగొండ పార్లమెంట్ టికెట్ కుమారుడికి ఇప్పించడంలో సక్సెస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఢిల్లీ మనసును గెలిచారు. నల్లగొండ ఎంపి టికెట్ను కుందూరు రఘువీర్కు ఇప్పించడంలో ఆయన విజయం సాధించారు. నల్లగొండ రాజకీయాల్లో తిరుగులేని ముద్రవేసిన జానారెడ్డి తాను పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి నల్లగొండ సీటును ఇప్పించడంలో సక్సెస్ సాధించారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అతిరథ మహారథులు ఎందరో నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నించినా తన రాజకీయ చతురను ప్రదర్శించి ఈ టికెట్ను ఇప్పించడంలో ఆయన కృతకృతులయ్యారు.
తలపడడమే తప్ప తలగ్గొని రఘువీర్
తలపడడమే తప్ప తలగ్గొని రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి జానారెడ్డి పేరు నిలబెట్టడంతో పాటు నిరంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశమై ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశారు. రఘువీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తమ పార్టీలో చేరాలని పలు పార్టీల నాయకులు ఆయన్ను ఆహ్వానించి ఒత్తిడి చేసినా ఆయన వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్లోనే కొనసాగారు. దీంతోపాటు పలు పార్టీల నాయకులు రఘువీర్కు తాయిలాలను ఇస్తామని ప్రకటించినా వాటిని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ పట్ల తనకున్న విధేయతను, నిబద్ధతను నిరూపించుకున్నారు.
సిఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా…
కొన్నేళ్లుగా సిఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రఘువీర్ కొనసాగుతున్నారు. రేవంత్తో రఘువీర్ తన మిత్రధర్మాన్ని కొనసాగిస్తున్నారు. సిఎం రేవంత్తో కష్టకాలంలోనూ రఘువీర్ కొనసాగారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ పార్లమెంట్ టికెట్ విషయంలోనూ రేవంత్రెడ్డిపై ఎన్ని ఒత్తిడిలు వచ్చినా చివరివరకు రఘువీర్కు టికెట్ ఇప్పించడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నం చేశారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించడంలో సిఎం రేవంత్ లౌక్యాన్ని ప్రదర్శించారు. ఈ టికెట్ కోసం హైకమాండ్పై ఎన్ని ఒత్తిడిలు వచ్చినా చివరకు రఘువీర్కే టికెట్ కేటాయించింది ఏఐసిసి.