-
కబ్జాల వెనక కథ
-
ఒక చోట కరుణ.. మరోచోట కూల్చివేత
-
డ్రీమ్ విల్లాస్పై సర్కారు ప్రేమ ఎందుకో..?
టీఎస్, న్యూస్: భూ కబ్జాల వ్యవహారంలో రేవంత్ సర్కారు చేస్తున్న విన్యాసాలు ఒకింత వివాదమవుతున్నాయి. కొందరిపై ప్రేమ చూపిస్తూ.. మరికొందరిపై కాఠిన్యం చూపిస్తున్నారనే విషయం ఇప్పుడు రియల్వర్గాల్లో ప్రధానాంశంగా మారింది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి విద్యా సంస్థల ముసుగులో చేసిన చెరువు కబ్జాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు సీఎం రేవంత్తో రాయబేరాలకు దిగారు. ఇదంతా రాజకీయ కోణం ఓవైపు ఉంటే.. ఏకంగా 111 జీవోలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న మరో సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.
డ్రీమ్ విల్లాస్
111 జీవో అమల్లో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు మొదలుపెట్టింది ఓ సంస్థ. గత ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కోర్టులో పిటిషన్లు పడ్డాయి. వివాదం సాగుతూనే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. కారణాలేమైనా.. 111 జీవోను అభయన్స్లో పెట్టింది. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో నిర్మాణ సంస్థలు మాత్రం ఖరీదైన నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు కోట్లకు కోట్ల చొప్పున అమ్మకానికి పెట్టింది. 111 జీవో పరిధి హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా విల్లాల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరిగింది. ట్రిపుల్ వన్ జీవోలో మొత్తం 84 గ్రామాల్ని చేర్చిన విషయం తెలిసిందే. అందులో మొయినాబాద్, అజీజ్నగర్, బాకారం వంటి ప్రాంతాల్లో అక్రమంగా విల్లాల్ని నిర్మించడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనవాయితీగా మారింది. వీటికి అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన పెద్దలే అండగా నిలిచారు. ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు ఏదోరకంగా హెచ్ఎండీఏ అధికారులను మేనేజ్ చేసి ఇష్టారాజ్యంగా విల్లాల్ని నిర్మించడం మొదలుపెట్టారు.
డ్రీమ్ వ్యాలీ అనే సంస్థ ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో డ్రీమ్ వ్యాలీ రిసార్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 111 జీవో ప్రాంతంలో అక్రమంగా కట్టిన రిసార్టు ద్వారా ఆదాయం గణనీయంగా గిట్టుబాటు అవుతుండటంతో.. ఈ కంపెనీ ఒక అడుగు ముందుకేసింది. అప్పటికే ప్రభుత్వ పెద్దలతో అండ పెంచుకోవడంతో మరో భారీ ప్లాన్కు దిగింది. రిసార్టు వెనక భాగంలో ఇమాజిన్ అనే హై ఎండ్ లగ్జరీ విల్లా కమ్యూనిటిని అక్రమంగా నిర్మిస్తోంది. ఇమాజిన్ విల్లా కమ్యూనిటీ బ్రోచర్ను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఇందులో ఒక్కో విల్లాను సుమారు పదిహేను చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.15 వేలుగా ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. అంటే, ధర దాదాపు రూ. 22.50 కోట్ల దాకా ఉంటుంది. ఇప్పటికే దీనిపై హెచ్ఎండీఏ దగ్గర పూర్తి డేటాకూడా ఉంది. అనుమతి లేకుండా నిషేదిత ప్రాంతంలో నిర్మించడంపై నివేదిక కూడా ఇచ్చారు.
మరేమైంది..?
చెరువును కబ్జా చేసిన నిర్మించిన విద్యా సంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న డ్రీమ్ విల్లాస్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. సదరు నిర్మాణ సంస్థ యజమానికి గత ప్రభుత్వంలోనే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే.. రాజకీయ కోణంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్చేస్తున్న రేవంత్ సర్కారు.. 111 జీవోను అతిక్రమించి నిర్మిస్తున్న విల్లాలపై మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఒకవేళ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కాంగ్రెస్లో చేరితే.. ఆక్రమణల కూల్చివేతలకు బ్రేక్ పడినట్టే. ఇదే సమయంలో డ్రీమ్ విల్లాస్ అధినేతతో కూడా ఇంకొంత బంధం బలపడితే.. ఇక్కడ కూడా విల్లాల్లో ‘సంతోషం’గా గృహ ప్రవేశం చేసుకోవచ్చన్న మాట. కాంగ్రెస్ రాజకీయ కోణం.. ఆర్థిక కోణాలు కొంతమందికి కలిసి వస్తున్నట్టే లెక్క.