- ఫోన్ల ట్యాపింగ్లో చైన్ లింక్
- రాజ్యసభ మాజీ ఎంపీకి లింకులు
- హార్డ్ డిస్క్లు దొరక్కుండా పారేసిన ప్రణీత్ రావు
- వికారాబాద్ అడవులు, మూసీ నదిలో కొన్ని
టీఎస్, న్యూస్: “ బిగ్బాస్..1, బిగ్బాస్..2 : రోజువారి రిపోర్ట్లో వెళ్లాయా.” ఇది ప్రణీత్రావు టీం పెట్టుకున్న పేర్లు. ప్రభుత్వంలోని ఇద్దరు కీలక నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగినట్లుగా తేలింది. ఇందులో బిగ్బాస్–1కు మాత్రం రోజువారీ డేటా వెళ్లినట్లు పోలీసుల విచారణలో ప్రణీత్రావు చెప్పినట్లు సమాచారం. ఇక, బిగ్బాస్–2 దీనికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. పెద్దసారుకు చెప్పాల్సిన కీలకమైనవన్నీ ఆయన ద్వారానే చేరవేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ బిగ్బాస్ –2 చెప్పడంతోనే ఓ మీడియా సంస్థ యజమాని దగ్గర సర్వర్లు పెట్టినట్లుగా తేలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఈ వ్యవహారంలో పెద్దోళ్ల లింకులు బయట పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కొంత ఉత్కంఠే. అప్పటి ప్రభుత్వంలోని కీలక మంత్రికి రోజువారీగా ఫోన్ల ట్యాపింగ్ డేటాను ఇచ్చినట్లు అంగీకరించారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రణీత్తో కలిసి మరో ఇద్దరు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, మరో పోలీస్ అధికారి తిరుపతి రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు విచారించిన పోలీసులు నేడు మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్ను పిలిచి విచారిస్తున్నారు. ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు గాను దర్యాప్తు అధికారులు సైబర్ క్రైమ్, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
వికారాబాద్ అడవి.. మూసీ నది
డిసెంబర్ 4వ తేదీన రికార్డ్స్ ధ్వంసమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అటు వికారాబాద్ అడవుల్లో, మూసీ నదిలో హార్డ్ డిస్కుల శకలాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ వంతెన కింద మూసీ నది ప్రవాహంలో ఆరు హార్డ్ డిస్క్లు లభ్యమయ్యాయి. ఇందులోని డేటాని రాబట్టడంపై పోలీసులు దృష్టి సారించారు.
ALSO READ: కవిత మరో మూడు రోజుల కస్టడీ
పలువురి ఇండ్లలో సోదాలు
ప్రణీత్రావును విచారిస్తున్న పోలీసులు.. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పలువురి ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. ఇంటలీజెన్సీ మాజీ చీఫ్ప్రభాకర్రావు ఇంట్లో తనిఖీలు చేశారు. తాజాగా హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్టాప్స్, 4 ట్యాబ్లు, 5 పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరికి లుక్ అవుట్ నోటీసులు
ఇంటలీజెన్సీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుతో పాటు మీడియా సంస్థ యజమాని ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి కోసం త్వరలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయనున్నారు. వీరితో పాటుగా ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ సోదాలు నిర్వహించారు.
సర్వర్లు పెట్టించింది మాజీ ఎంపీ
ఫోన్ల ట్యాపింగ్కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. మీడియా సంస్థ యజమాని ఇంట్లో సర్వర్లు పెట్టించి, ట్యాపింగ్ చేపించింది రాజ్యసభ మాజీ ఎంపీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, అప్పటి సీఎం చెప్తేనే ఆయన ఈ సర్వర్లు పెట్టించారా.. లేదా సొంతంగా పెట్టించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.