ఏపీ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ.. తెలంగాణలోనూ టీడీపీతో జత కట్టింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చర్చలు జరిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి భేషజాలు పెట్టుకోకుండా ప్రతీ టీడీపీ కార్యకర్త ఈసారి బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని చింతల రామచంద్ర రెడ్డి కోరారు. చీలిక ఓటు ఇతర పార్టీలకు వేస్తే ఉభయులకు నష్టం చేకూరుతుందని, ఏపీలో చంద్రబాబు సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డికి టీడీపీ మద్దతు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారని, ఆరోజు బహిరంగసభకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రావాలని ఆయన కోరారు.
కిషన్రెడ్డి గెలుపునకు టీడీపీ కృషి
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జి. కిషన్రెడ్డి గెలుపునకు టీడీపీ కృషి చేస్తుందని పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్కుమార్ గౌడ్ తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీతో టీడీపీ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సోమవారం దోమలగూడలోని టీడీపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డికి మద్దతుగా టీడీపీ నగర అధ్యక్షుడు పి. సాయిబాబా అధ్యక్షతన సమావేశం జరిగింది.