నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరుతపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్ష సంపద అంతరిస్తుండటంతో వన్యప్రాణులు తలదాచకునేందుకు నిలువు నీడ లేకుండా పోతున్నదని వెల్లడించారు. దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్వో వీణా వాణి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమిలో కనీసం నాలుగు చిరుతలు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలులతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందిందని డీఎఫ్వో తెలిపారు.