లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనమయ్యింది. శుక్రవారం గాంధీ భవన్లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షుడు రమేష్ తో పాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. లేబర్ పార్టీని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సూచన మేరకు విలీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. పార్టీలో రమేశ్కు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామన్నారు.