- అందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలి
- మీ ప్రాంతాన్ని ఎవరు అద్భుతంగా అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలి
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
ఓటు హక్కు అందరి బాధ్యత అని, అందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని, మనల్ని ఎవరు పాలించాలో మనమే ఎన్నుకోవాలని, మీ ప్రాంతాన్ని ఎవరు అద్భుతంగా అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంజిబిఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఓటర్లకు అవగాహన పెంచేలా ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ఆర్టీసి ఎండి సజ్జనార్, రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్లతో కలిసి ప్రారంభించారు.
ఈ ఫొటో ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చన్నారు. పోలింగ్ సెంటర్ చెక్ చేసుకొని ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల ద్వారా ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు రద్దీ ఉన్న ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు.
ఈ ఫొటో ఎగ్జిబిషన్తో చాలా ప్రయోజనకరం టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలకు ఓటింగ్పై అవగాహన పెంచేందుకు సీఈఓ వికాస్ రాజ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎంజిబిఎస్లో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. రోజు ఇక్కడ నుంచి లక్ష మంది ప్రయాణం చేస్తారని ఆయన తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేలా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, యువత ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.