- కిషన్రెడ్డి, బండి సంజయ్లు తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి
- బహిరంగ లేఖ రాసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో శనివారం ఆయన పోస్టు పెట్టారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కిషన్రెడ్డి, బండి సంజయ్లను పొన్నం డిమాండ్ చేశారు. బిజెపి రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టీ బిసి, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు బిజెపికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 1986 నుంచి రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేయడానికే కుట్ర చేస్తుందన్నారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బిజెపి కాదా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణన సర్వే జరపాలని ఎవరికెంతో -వారికంత అనే నినాదిస్తే ప్రభుత్వం తరుపున కులగణన సర్వేకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన అన్నారు.
రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూల దోసింది బిజెపి ప్రభుత్వం కాదా..? బీహార్లో 50 నుంచి -65 శాతానికి రిజర్వేషన్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు ఇచ్చిందని తట్టుకోలేక జేడీయూ, ఆర్జేడి, కాంగ్రెస్, వామపక్షాల ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరపరచలేదా? అని పొన్నం మండిపడ్డారు.