- ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్కు వినతిపత్రం అందించిన ట్రెసా నాయకులు
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో పని చేస్తోన్న ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వంగ రవీందర్ రెడ్డి, కె.గౌతమ్ కుమార్లు కోరారు. గత ఆర్థిక సంవత్సరంలో సమర్పించిన వెహికల్ బిల్స్, సప్లిమెంటరీ శాలరీ బిల్స్, మెడికల్ బిల్స్ వంటి వివిధ రకాల బిల్లులను మంజూరు చేయించాలని వారు కోరారు. అలాగే తిరస్కరించిన బిల్లులను తిరిగి పునరుద్ధరించాలని ఈ మేరకు ఆయనకు వారు వినతిపత్రం సమర్పించారు.
పే అండ్ అకౌంట్స్ ద్వారా శాలరీ పొందుతున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి వారి వేతనాలు చెల్లించే విధంగానే ఎన్నికల గౌరవ వేతనం కూడా చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సెలవులో ఉండడంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ను వారు కలిశారు. దీనిపై కృష్ణ భాస్కర్ సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల తర్వాత ఉద్యోగుల బిల్లులు పాస్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. పే అండ్ అకౌంట్స్ ద్వారా వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు అక్కడే ఎన్నికల గౌరవ వేతనం చెల్లించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.