పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల రాజకీయం చర్చకు దారి తీస్తోంది. బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ టి.భార్గవ్ చేరికకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేసింది. శనివారం 13 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లతో భార్గవ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమం జరిగిన కొద్దిసేపటికే ఆయన చేరికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీపాదాస్ మున్షీ సలహా మేరకు భార్గవ్ చేరికను నిలుపుదల చేశామని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆయన చేరికపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు చేరే వరకు భార్గవ్ చేరిక నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.