Thursday, May 9, 2024

పాలమూరు పాలుగారే బంగారు తునక – సీఎం కేసీఆర్ స్పీచ్

మహబూబ్ నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా , ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా దు:ఖంతో పోయేది. కండ్లల్లో నీళ్లొచ్చేది. ఆ రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికి ఉండే. నాతో పాటు తిరుగుతుండేవారు. జయశంకర్ సార్ చెప్పారు. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే కచ్చితంగా మీరు ఎంపీగా పోటీచేయాలే. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. గెలిపిస్తారని జయశంకర్ సార్ నాకు చెప్తే ఇదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసినాను. లక్ష్మారెడ్డి ముందుండి పార్లమెంటు ఎన్నికను భుజాల మీద వేసుకుని ఎంపీగా నన్ను గెలిపించాడు. ఏరోజు కైనా మహబూబ్ నగర్ చరిత్రలో కీర్తి ఉంటుంది. 15 ఏండ్లు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణను సాధించిన కీర్తి స్థిరస్థాయిగా మహబూబ్ నగర్ కు ఉంటుంది.

* జయశంకర్ గారు నేను నారాయణ పేట ప్రాంతం పోయి హైదరాబాద్ కు వెళ్లడానికి నవాబ్ పేట మీదుగా అటవి గుండా వస్తున్నాం. అక్కడ అటవిని చూసి జయశంకర్ నేను అనుకున్నం. మనుషులు కాదు చివరికి అడవి కూడా బక్కపడిపోయిందని సన్నగా ఉన్న చెట్లను చూసి బాధపడ్డాం. ఒక గోస కాదు మహబూబ్ నగర్ ది. అనేక సందర్బాల్లో కండ్లకు నీళ్లొచ్చేది. నేను నడిగడ్డ కు పోయిన రోజు కూడా ఒక ఊర్లో ఏడ్చినం. మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలవిసేలాగా మాకు బాధ కలిగేది. ఏం దుర్గతి కృష్ణానది పక్కనుంచే పారుతున్నా అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం , దత్తత తీసుకోవడం , నాటకాలాడటం, శిలాఫలాకాలెయ్యడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో లాభం జరుగలేదు. ఉద్యమంలో పాట కూడ నేనే రాసిన. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే,పాలమూరు నల్లగొండ ఖమ్మంమెట్టు పంటలెండె అని రాశాను. మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉంటది. ఇక్కడ దు:ఖం ఎక్కువ ఉంటుంది. బాధ ఎక్కువగా ఉంటుంది. పేదరికం ఎక్కువగా ఉన్నది. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చాక లక్ష్మారెడ్డి సహచరుడిగా క్యాబినెట్ మంత్రిగా ఉండె. వైద్యశాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇయ్యాల వచ్చిన డయాగ్నిసిస్ సెంటర్లు. డయాలసిస్ సెంటర్లు లక్ష్మారెడ్డి పుణ్యమే. కొన్ని నెలల పాటు కిందామీద పడ్డాం. ఎక్కడినుంచి ఎక్కడికి రావాలె నీళ్లు ఎట్లా రావాలే. మన హక్కు కృష్ణా జలాల్లో రావాలే అని పరిశోధనలు చేశాం.

* అంతకు ముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,ఇక్కడ ఉన్న కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు, వాళ్లకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొమ్మంటే మాట్లాడలేదు. జూరాల అనేదే బెత్తెడు ప్రాజెక్టు. దాంట్లో నీళ్లుండేదే పది టీఎంసీలు. మనం తీసుకునేది ప్రతిరోజు 2 టీఎంసీలు . ప్రతిరోజు రెండు టీఎంసీలు గుంజితే మూడు రోజులకు జూరాల ఖతమైపోతది. మళ్లా తర్వాత నీళ్లు ఎక్కడ నుంచి తీసుకోవాలే. తెలంగాణ ను మరొక్క సారి గోల్ మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని చెప్పినరు. జూరాల నుంచి మనం ఎందుకు తీసుకుంటాం? శ్రీశైలం వారి అయ్యా జాగీరా? దాంట్లో మన పైసలు లేవా? బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని అధికారులకు చెప్పాను. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం కు మార్చినం. అదే దద్దమ్మ సన్నాసులు పాలమూరులో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు . వారికి ఎందుకు తెలివి తక్కువున్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్ట పుట్టిండ్లో నాకు అర్థం కాదు. చాలా బాధ అయితది. వాళ్లు మాట్లాడుతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండెనని. సిగ్గుండాలి మీకు. మీకేమన్నా తెలివున్నాదా ? జూరాలలో ఎన్ని నీళ్లున్నయో తెలుసా? ఎన్ని రోజులు సరిపోతాయే తెలుసా? ఆరోజు భావ దారిద్ర్యమే. మధ్యలో మనం ఉద్యమం చేస్తున్నావారిలో భావ దారిద్రమే, ఈ రోజు కూడా వారిది బావ దారిద్య్ర‌మే. ఒక్కమాట గుండెల మీద చేయి పెట్టి ఆలోచించాలి. 1956లో చిన్న పొరపాటు జరిగింది. కొద్దిగా మరిచి పోయి ఉన్నారు మనోళ్లు. ఆ దెబ్బకు మనల్ని కొంచెపొయ్యి అంధ్రలో కలిపేస్తే 60 ఏండ్లు గోసపడ్డాం.

* గంజి కేంద్రాలు తెరిచే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం అయిపోయినం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా. తాలుకాలు తాలుకాలే ఖాలీ అయిపోయిన పరిస్థితి. జడ్చర్లలో కూడా లంబాడి బిడ్డలో హైదరాబాద్ తో పాలు ఇతర చోట్లకు వలస వెళ్లారు. కండ్లారా చూసినాం. బాధలు పడ్డాం. గోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి పల్లెపల్లెలో పల్లేర్లు మొలిసి పాలమూరులోన అని పాటలు రాశారు. పల్లెపల్లెల్లో పల్లేర్లు మొలవాలెనా. పల్లేర్లు మొలవాలనా అని, దీనికోసమేనా పుట్టింది అని పిడికిలెత్తి పోరాటం చేస్తే, అందరూ దీవెన ఇస్తే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఎవ్వరూ పుక్కానికి ఇవ్వలే. అనేకమందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, చాలా బాధలు పెట్టి చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావునోట్లో తలకాయపెడితే తప్ప తెలంగాణ రాలేదు. ఎవడో ఇవ్వలే తెలంగాణ? పుక్కానికి వచ్చి ఎవడూ తెలంగాణను ఇవ్వలే. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సు. 60 ఏండ్లు గోసపోసుకుని మనం బొంబాయి పోయేటట్టు కూలీ పనేటట్టు, వలస పోయేటట్టు పోసింది కాంగ్రెస్ పార్టీ.

* మళ్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మనమే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు, కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారు. అడ్డం పడ్తున్నారు. అది కావద్దని, అది పూర్తయితే లక్ష్మారెడ్డికి పేరు వస్తది.శ్రీనివాస్ గౌడ్ కు పేరు వస్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరు వస్తది. కేసీఆర్ కు పేరు వస్తాదని దానికి అడ్డగాతులు పెట్టినారు. అయినప్పటికీ మొండి పట్టుదలతో పోయినం. ఈ మధ్యనే తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత అనుమతులన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నది. ధర్మం గెలుస్తది, న్యాయం గెలుస్తది . మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం చేసినాను. దానిమీద రావాల్సిన నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండపూర్ కావచ్చు. రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యాయి. టన్నెల్స్ అన్ని కంప్లెంట్ అయిపోయినయి. మోటర్లన్నీ బిగుస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని రిజర్వాయర్లల్లో నీళ్లు కండ్ల చూడ బోతున్నాం. పాలమూరు కరువు అనేది పోతది. ఉద్దండాపూర్ కంప్లీట్ అయితే జడ్చర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఓక కొసకు కరివెన ఉంటుంది. నెత్తిమీద నుంచి ఉద్దండాపూర్ ఉంటది. రెండు మూడు నెలల్లో జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కరువు అనేది మనదిక్కు కన్నెత్తి కూడా చూడదు. సస్యశ్యామలమైన అద్భుతమైన తాలుకా తయారైతది.

* హైదరాబాద్ సమీప ప్రాంతం జడ్చర్ల. శంషాబాద్ నుంచి 40 నిమిషాలే తొవ్వ 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. లక్ష్మారెడ్డి పోలేపల్లి సెజ్ తెచ్చినారు. చాలా మంది ఉద్యోగాలు దొరికినాయి. పరిశ్రమల కేంద్రంగా , ఐటీ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. మొదట మంచినీళ్ల బాధ పోవాలని మిషన్ భగీరథ పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వస్తున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి , నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కంప్లీట్ చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల ఎంబడి పడ్డాం. 90 శాతం పూర్తయింది. 10 శాతం త్వరలో పూర్తి కాబోతుంది. అనుమతులు వస్తున్నాయి. పాలమూరు పూర్తయితే పాలుగారే జిల్లాగా బంగారు తునకగా మారుతది. అద్భుతంగా మారుతుంది.

* జడ్చర్ల ఎమ్మెల్యే గారి తండ్రి చనిపోతే నేను పరామర్శకు పోతూ ఎమ్మెల్యేలను, మంత్రులను నా బస్సులో ఎక్కించుకుని రోడ్డు మార్గాన వెళ్ళాను. గతంలోఇప్పటికి పాలమూరు ఎలా మారిందని చూడటానికి బస్సులో వెళ్లాను. గతంలో ఇప్పటికీ చూసినా పంటపొలాలు, వరిపొలాలు అద్భుతమైన సీన్లు దర్శనమిచ్చాయి. దుందుభి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకుపోయి ఉండేది. ఇప్పుడు దుందుభి నది మీద ఎన్నో చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఎక్కడ చూసినా నీళ్లు ఆగి ఉన్నాయి. కొల్లాపూర్ పోతుంటే దుందుభి నది దాటుతూ ఉంటే నీళ్లు కనబడతున్నయి. ఒకప్పుడు దుందుభి దుమ్ముకొట్టుకుపోయే పరిస్థితి నుంచి జీవనదిగా మారింది. పాలమూరు పూర్తయితే జిల్లా రూపురేఖలే మారుతాయి. లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లు ఉంటుంది. ఏ రోజైనా పేదల గురించే ఆలోచన చేసినాం. మతాలు లేవు. కులాలు లేవు. ప్రతి ఒక్కరు కడుపులో పెట్టుకుని సమానంగా చూసినం. ప్రతి ఒక్కరూ మన బిడ్డలేనని చూసినం. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. బీసీలు, దళితులు, మైనారిటీల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణ పేదలు కూడా అడుగుతున్నారు. వారికి కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తున్నాం. ఏ స్కీం తీసుకున్నా అందిరినీ కవర్ చేశాం. కల్యాణలక్ష్మీ తీసుకున్నా…షాదీ ముబారక్ ఇచ్చుకున్నా కులం మతం లేకుండా అందరినీ సమానంగా చూసుకున్నాం

* తెలంగాణ ముస్లీం పెద్దలకు, నాయకులకు సలాం చేస్తున్నా . హిందూ , ముస్లీంలు మొత్తం భారతదేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ తయారైంది. సంసారం చేసినట్లు మ్యానిఫెస్టోలో పథకాలు పెట్టుకున్నాం. మ్యానిఫెస్టో విడుదల చేసినం, సంసారం చేసినట్లు చేసుకున్నాం. రైతుల కోసం పట్టుబట్టి జట్టుకట్టి… రైతుబంధు పథకం నేను డిజైన్ చేసిందే పుట్టించిందే రైతుబంధు పథకం . ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇండియా లేదు. వాడొకడు వీడొకడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతారు. బీఆర్ ఎస్ కు ముందు ఎప్పుడైన విన్నమా రైతుబంధు వంటి పథకం. తెలంగాణ రైతన్నల ముఖాలు తెల్లబడాలని రుణమాఫీ చేసుకున్నాం. 37 వేల కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫీ చేసినా ఇంకొక పదేండ్లు కష్టపడితే భారత దేశంలోనే గొప్ప రైతుగా తయారవుతారు.

* కర్ణాటకలో ఎన్నికల ముందు 20 గంటల కరెంటు ఇస్తానన్నారు. ఇప్పుడు 5 గంటలు ఇస్తామంటున్నారు. కర్ణాటక రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్నది కక్కిండు . 3 గంటలు చాలట విద్యుత్ సరఫరా. 24 గంటలు కావాలా? 3 గంటలు కావాలా? కాంగ్రెస్ వస్తే కరెంటును కాటగలుపుతరు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీం, మస్తుగ చెప్తరు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అడ్డం పొడుగు మాట్లాడారు. భారత దేశం మొత్తంలో 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. లక్ష్మారెడ్డి కోరిన పోలీసు స్టేషన్లు ఎన్నికల తెల్లారే జీవో తీసి ఇస్తాను.ఉద్దండాపూర్ ప్రాజెక్టులో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం.డ‌నేను రాజీనామా చేసిన నాడు ఆయన కూడా చేసిండు. ఉద్యమం ఆసాంతం నా వెంబడి ఉన్న నిఖార్సయిన నాయకుడు లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని అర్థమైపోతావుంది. భారీ మెజారిటీతో గెలిపించాలి. వాల్యానాయక్ తండాలో పడుకున్న. 52 తండాలు గ్రామపంచాయతీలు చేసుకున్నాం. లంబాడీ తండాల్లో వాళ్లకే రాజ్యం వచ్చింది. మీరందరూ దీవించాలని కారుగుర్తుకు ఓటు వేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కారుగుర్తుకే మన ఓటు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular