Thursday, May 2, 2024

ప్రభుత్వ రాబడులకు అధికారుల చిల్లు..!

  • ప్రభుత్వ రాబడులకు అధికారుల చిల్లు..!
  • మూడు ఆర్థిక సంవత్సరాల్లో సుమారుగా రూ.2వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
  • రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన అసెస్‌మెంట్‌లను
  • పునః పరిశీలించాలని వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయం
  • కిందిస్థాయి అధికారులు చేసిన అసెస్‌మెంట్‌ల
  • పునః పరిశీలన బాధ్యతలు పైస్థాయి అధికారులకు అప్పగింత

గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీ అసెస్‌మెంట్‌లకు సంబంధించి భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. మూడు ఆర్థిక సంవత్సరాలకు చెందిన 15,000ల అసెస్‌మెంట్‌లను పునః పరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1000 నుంచి రూ.2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2021,-22, 2022,-23, 2023,-24 ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో 14 వాణిజ్య పన్నుల డివిజన్ల పరిధిలో రూ.16,172 కోట్ల విలువైన, 70,000లకు పైగా అసెస్‌మెంట్‌లను పూర్తి చేశారు. అయితే ఇందులో రూ.13,000ల కోట్లకుపైగా విలువైన దాదాపు 15,000ల అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగినవి ఉండడంతో వాటిని పునఃపరిశీలన చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం

గతంలో కొందరు అధికారులు అసెస్‌మెంట్ల సమయంలో ప్రభుత్వ రాబడులకు గండికొట్టి అధికారులు జేబులు నింపుకున్నట్లు ఈ మధ్య ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో వాటిపై పునః పరిశీలన చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన అసెస్‌మెంట్ పునఃపరిశీలన చేయాలని ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు అందడంతో ఆ దిశగా లోతుగా విచారణ ప్రారంభించారు. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం కింది స్థాయి అధికారులు చేసిన అసెస్‌మెంట్‌ను పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేసేందుకు, లోటుపాట్లను సవరించి ఎక్కువ ట్యాక్స్ మదించేందుకు అవకాశం ఉంది.

తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు

ఉన్నతాధికారుల ఉత్తర్వులకు అనుగుణంగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్ పరిధిలో చేసిన అసెస్‌మెంట్ల జాబితాను పునః పరిశీలన చేసే అధికారం ఆయా డివిజన్ జాయింట్ కమిషనర్లకు, కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ కమిషనర్లకు ఇచ్చారు. గతంలో చేసిన అసెస్‌మెంట్లు చేసిన వాటిలో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉండి ఉంటే అన్నింటిని పొందుపరుస్తూ కమిషనర్‌కు వారు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. అలాగే వాటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసి తప్పులు దొర్లిన అసెస్‌మెంట్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కిందిస్థాయి అధికారులు చేసిన పన్ను మదింపును తాజాగా పైస్థాయి అధికారులు పునఃపరిశీలించి తప్పులు ఉంటే మొదటగా అసెస్‌మెంట్ చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular