* అవకాశవాదంతో పార్టీ మారడం లేదు
* 13యేళ్ల తరువాత సొంత గూటికి చేరుకునే సమయం వచ్చింది
* అందుకే తిరిగి ప్రయాణం మొదలు
* స్పష్టం చేసిన కే. కేశవరావు
టీఎస్, న్యూస్:కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పోరాటం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు.తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న కేసీఆర్ స్లోగన్తోనే ఇన్నాళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. శుక్రవారం నాడు తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, 85 ఏళ్లున్న తాను 55 ఏళ్లు కాంగ్రెస్లోనే పని చేశానని అన్నారు. సీడబ్య్లూసీ మెంబర్గా, నాలుగు రాష్ట్రాల ఇన్చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేయడం వల్ల ఆ పార్టీతో తనకు కొంత తేడా వచ్చిందని కేశవరావు చెప్పారు. విధిలేక కాంగ్రెస్ ను వీడాల్సి వవచ్చిందన్నారు.
తెలంగాణ గురించి కేసీఆర్ ఆలోచించక ముందే తాము ఆలోచించామని అన్నారు. తన కొడుకు విప్లవ కుమార్ కోరిక మేరకు ఆనాడు టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోని పార్టీని సరి చేసుకోవాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబమే పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతోనే….. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. యువకులను ముందు పెట్టీ బీఆర్ఎస్ నడిపించాలన్నారు. గులాబీ పార్టీలో తన 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని వివరించారు. తన కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు.
తాను ఎప్పుడు చేరేదన్న విషయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు కేకే వెల్లడించారు. అయితే రాజకీయ అవకాశవాదంతో తాను పార్టీ మారట్లేదన్నారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ ఆ నాడు చెప్పారని.. కానీ మాటమీద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. విలీనం చేయకపోవడం కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఒక కారణమన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. కేసీఆర్ను కూడా ఇండియా కూటమిలో చేరమని సలహా ఇచ్చానని అన్నారు. బీఆర్ఎస్ విషయంలో తాను తప్పు చేస్తే మన్నించాలని కోరారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. మళ్లీ ఎన్నికలోచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయమంటే చేస్తానని కేశవరావు తెలిపారు.