- షోకాజ్నోటీసు జారీ చేసిన రెరా
- ఆర్ఈజీ న్యూస్కు స్పందన
టీఎస్, న్యూస్ : ప్రీలాంచ్ మోసాలపై రెరా స్పందించింది. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా.. కనీసం నిర్మాణాలు కూడా మొదలెట్టకుండా బయ్యర్ల నుంచి వసూళ్లు చేస్తున్న నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ ప్రాజెక్టు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెరా సెక్రెటరీ యాదగిరి ఈ నోటీసులు ఇచ్చారు. హెచ్ఎండీఏ అనుమతి తీసుకోకుండా, రెరా పర్మిషన్ లేకుండా బయ్యర్ల నుంచి వంద శాతం సొమ్ము వసూలు చేయడానికి తెగబడిన బిల్డర్ వెంకటేశ్వర్రావు రెడ్డి వ్యవహారాన్ని ‘ ఆర్ఈజీ న్యూస్’ వెలుగులోకి తీసుకురావడంతో రెరా రంగంలోకి దిగింది. ఇక్కడ చదరపు అడుక్కీ రూ.4700కే ఫ్లాట్లను అందజేస్తామని బయ్యర్లను మభ్యపెడుతున్నట్లు గుర్తించారు.
నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ అనే ప్రాజెక్టును కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద.. సర్వే నెంబర్ 1011లోని.. 19.12 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లుగా చూపిస్తూ పెద్ద మొత్తంలో బయ్యర్ల నుంచి వసూళ్లు చేస్తున్న వైనాన్ని ‘ ఆర్ఈజీ న్యూస్’ వెలుగులోకి తీసుకువచ్చింది. ‘ ప్రీలాంచ్ కథనంపై రెరా ఆరా తీసింది. ఈ సంస్థ బ్రోచర్ ప్రకారం రెండు వేల ఏడు వందల ఎలైట్ కుటుంబాలు నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ ప్రచారాన్ని చేస్తున్నట్లు వెల్లడైంది.
అయితే, నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ ప్రీలాంచ్ ప్రకటనతో కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు రియల్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చెప్పిన ప్రకారం ఒక ఎంఓయూ చేసుకుంటున్నారు. అందులో గూడె వెంకటేశ్వర్రావు రెడ్డి అనే యాభై ఐదేళ్ల వ్యక్తి ఈ అవగాహన పత్రం మీద సంతకం పెడుతున్నట్లుగా రాసి ఉంది. ఎంవోయూలో ఉన్నట్టుగా ప్రీలాంచ్లో కొనే బయ్యర్ సదరు వెంకటేశ్వర్రావుకు అప్పు కింద సొమ్ము ఇస్తున్నాడని రాసి ఉంది. అంటే చేబదులు కింద లక్షల రూపాయల్ని బిల్డర్కి ఇస్తున్నాడడు. ఇలా సొమ్ము ఇచ్చినందుకు గాను రెండు సంవత్సరాల తర్వాత సదరు బిల్డర్ ఆయా మొత్తం మీద ఆరు శాతం వడ్డీతో సొమ్మును వెనక్కి ఇచ్చేస్తామని, లేకపోతే, ఆ సొమ్ముకు గాను ఫ్లాట్ రూపంలోనైనా ఇస్తామంటూ ఉంది. ఇది ఫ్లాట్ను అమ్ముతున్నట్లుగా కాదు.
షోకాజ్ నోటీసు
ఆర్ఈజీ న్యూస్ కథనంతో పాటుగా మరిన్ని వివరాలు సేకరించిన రెరా.. శనివారం గూడె వెంకటేశ్వరరావు రెడ్డికి షోకాజ్నోటీసు జారీ చేసింది. ఆయన కార్యాలయానికి ఈ నోటీసులు పంపించారు. వెంటనే సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు రెరా అధికారులు వెల్లడించారు.