-
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం
-
ఉప్పల శ్రీనివాస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-అర్యవైశ్యుల అభ్యున్నతికి అన్నివిధాలుగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉప్పల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్యమంత్రి రేవంత్ను శుక్రవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి, ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేద, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.
ఆర్యవైశ్యులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఈ సందర్భంగా సిఎం పిలుపునిచ్చారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ గూటికి చేరడం శుభపరిణామన ఆయన తెలిపారు. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన సిఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావులను ఉప్పల శ్రీనివాస గుప్తా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐవిఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్, ట్రెజరర్ కొడిపాక నారాయణ, కటకం శ్రీనివాస్, ఐవిఎఫ్ యూత్ ప్రెసిడెంట్ కట్టా రవికుమార్, ట్రెజరర్ నరేష్ గుప్తా తదితరులున్నారు..