కరీంనగర్లో వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి పొంగులేటి రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాఖాన్లు నామినేషన్ల దాఖలు కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయకముందే అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
మొత్తం 17 ఎంపి స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపి అభ్యర్థులపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపో తోంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ప్రకటన రాకముందే ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కీలక నేతలు సోమ, మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ సమర్పించగా మంగళవారం ఖమ్మం నుంచి పొంగులేటి రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాఖాన్లు తమ నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.