* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చతుర్ముఖ వ్యూహం!
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్రధా న ప్రతిపక్షాలు బీఆర్ ఎస్, బీజేపీలకు.. సీఎం రేవంత్రెడ్డి తనదైన శైలిలో చెక్ పెడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఊహించిన విధంగా అదరిపోయే షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోనే అతి పెద్ద పార్లమెం టు నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరిని కైవసం చేసుకునేందుకు బీజేపీ, బీఆర్ ఎస్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిట్టింగ్ సీటు అయిన రేవంత్ను సవాళ్లతో ఈ రెండు పార్టీలు కూడా ఉడికిస్తున్నాయి. దమ్ముంటే.. చూసుకుందాం.. రా! అంటూ కేటీఆర్ ఇటీవల సవాళ్లు రువ్విన విషయం తెలిసిందే. అయితే.. ఈ సవాల్కు దీటుగా పైకి సమాధానం చెప్పకపోయినా.. రేవంత్ తెరచాటున తన చతురతను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగే నాయకుడు ఎంత రేంజ్లో ఉన్నా.. బలంగా ఢీకొనేలా.. చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.
వ్యూహం 1- పాత వాసనలకు స్వస్తి చెప్పి.. కొత్త ఫేసును మల్కాజిగిరి నుంచి రంగంలోకి దింపడం. తద్వారా తటస్థ ఓటు బ్యాంకును కైవసం చేసుకోవడంతోపాటు.. ప్రజలకు కొత్త నేతను పరిచయం చేయడం ద్వారా.. రాజకీయాల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం.
వ్యూహం 2 – బీసీ సామాజిక వర్గాల్లో అత్యంత వెనుక బడిన వర్గానికి మల్కాజిగిరి వంటి ప్రతిష్టాత్మక స్థానాన్ని కట్టబెట్టడం. తద్వారా.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోందో వెల్లడించడం.. ఇదే సమయంలో ఆయా వర్గాల ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మళ్లించడం.
వ్యూహం 3- రాజకీయాల్లో జర్నలిస్టును పరిచయం చేయడం. అది కూడా ప్రతిష్టాత్మక పత్రిక ఈనాడులో సుదీర్ఘ అనుభవం ఉన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా.. మేధావులు, విద్యావంతుల ఓట్లను తనవైపు తిప్పుకోవడం. ఇదే సమయంలో యువత కోట్లను, విద్యార్థుల ఓట్లను కూడా.. కైవసం చేసుకునే కీలకమైన చతురతకు పెద్దపీట వేయడం.
వ్యూహం 4 – బీసీల్లో వెనుకబడిన వర్గానికి చెందిన జర్నలిస్టుకు టికెట్ ఇవ్వడం ద్వారా.. ఇటు బీసీలను, ఈనాడు పత్రిక సీనియర్ జర్నలిస్టుకు చాన్స్ ఇవ్వడం ద్వారా.. రామోజీ ఆశీస్సులు కైవసం చేసుకుని కమ్మ వర్గం ఓట్ల ను తనవైపు తిప్పుకోవడం.. వంటివి రేవంత్ చతుర్ముఖ వ్యూహంలో కీలకంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. దీనికి తోడు.. రాజకీయాల్లో కొత్త వారికి ఛాన్స్ లేదు. చదువుకున్న వారికి ఛాన్స్ లేదు.. అనే వ్యాఖ్యలకు.. ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా .. తన వ్యూహానికి తిరుగులేదన్న సంకేతాలను.. బీఆర్ ఎస్, బీజేపీలకు పంపడం మరో ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈనాడు సంస్థ ఛైర్మన్, ఎండీలు కూడా సదరు జర్నలిస్టు పట్ల సానుకూలంగా ఉండటం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.