- అధికారులతో కలిసి నాగోలు నుంచి 14 కిలోమీటర్ల మార్గాన్ని
- పరిశీలించిన మెట్రో ఎండి
హైదరాబాద్ మెట్రోరైల్ ఎయిర్పోర్టు కారిడార్ నిర్మాణం ముందడుగు పడింది. నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మెట్రోమార్గాన్ని ఆ సంస్థ ఎండి ఎన్వీఎస్ రెడ్డి శనివారం పరిశీలించారు. నాగోలు నుంచి 14 కిలోమీటర్ల మార్గాన్ని ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన ఆయన, స్థలసేకరణ, మెట్రోస్టేషన్ల నిర్మాణం, మూసీనది, ఎల్బీనగర్, బైరామల్ గూడ వద్ద పైవంతెనలతో ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు. జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెట్రో ఉన్నతాధికారులతో పాటు కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి 14 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించి ఎండి అధికారులకు పలు సూచనలు చేశారు.
నాగోలు -టు ఎయిర్పోర్ట్ మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రోస్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్కు దగ్గరలో ఎల్బీనగర్ వైపు నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆ రెండుస్టేషన్లను కాన్కోర్ లెవల్లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని ఎండి అధికారులను ఆదేశించారు. నాగోల్ స్టేషన్ తర్వాత మూసీనది వంతెనపై ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్ల దృష్ట్యా ఎలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమవైపునకు జరపాలని ఎండి సూచించారు.
మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికని దృష్టిలో ఉంచుకొని మూసీపై పొడవైన స్పాన్లతో వంతెన నిర్మించాలని ఎండి నిర్దేశించారు. మూసీ దాటాక కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీనిస్తూ చుట్టుప్రక్కల ఉన్న కాలనీవాసుల అవసరాల కోసం అదనపు స్టేషన్ కోసం ప్రణాళిక తయారుచేయాలని అధికారులకు ఎండి సూచించారు.
Tags: hyd metro corridor, metro from shamshabad airport,Metro rail Airport Corridor