టీఎస్, న్యూస్:మాజీ సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత వరుస ప్రచారాలు, సభలతో ప్రజల్లోకి వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్గా విమర్శలకు పదను పెడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా ఆయన సోషల్ మీడియాను విస్త్రతంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న 24 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇన్నాళ్లు ఫేస్ బుక్కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాంలైన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాని ఫుల్గా వాడేసుకోవడానికి రెడీ అయిపోయారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై కేసీఆర్, బీఆర్ఎస్ రోజూవారీ రాజకీయ సమాచారాన్ని ఎక్స్, ఇన్ స్టాలో పంచుకోనున్నారు. సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలు షేర్ చేసుకోబోతున్నారనే ఆసక్తి నెటిజన్లలో ఉంది. మొత్తంగా ఇన్ స్టా, ఎక్స్, ఫేస్ బుక్లలో కేసీఆర్ అకౌంట్లను కలిగి ఉన్నారన్నమాట.
తొలి పోస్ట్లో ఏమన్నారంటే
ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. తొలి పోస్ట్ని షేర్ చేసుకున్నారు.”బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు” అని రాసుకొచ్చారు. దీనికి ఉద్యమకాలంనాటి ఫొటోను జతచేశారు.