- ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి
- కాకమ్మ కబుర్లు చెబుతున్న కెసిఆర్
- ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కెసిఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఊడ్చిపెట్టుకుపోతుంటే ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కెసిఆర్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి కెసిఆర్ ఆపసోపాలు పడుతున్నారని ఆయన అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి చివరికి అబద్ధాలను నమ్ముకున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని కెసిఆర్ బూటకపు మాటలను చెబుతున్నారన్నారు. ప్రజలు అధికారం నుంచి తన్ని తరిమేసినా చంద్రశేఖర రావుకు సిగ్గు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల కెసిఆర్ను భరించలేక జనం సిఎం కుర్చీ లాగేశారన్నారు. బడాయి కబుర్లు వినలేకనే ఫాంహౌజ్ కు తరిమికొట్టారన్నారు. అధికారం పోయినప్పటికీ కెసిఆర్లో మార్పు రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుతంత్రాలను కెసిఆర్ ఆపడటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.