Thursday, May 9, 2024

వెధవ అంటేవెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు

  • పొన్నం తిట్లను దీవెనలుగా భావిస్తా
  • నా లేఖలవల్లే నిధులొచ్చాయని డబ్బా కొట్టుకునే వినోద్ చేసింది శూన్యం
  • కేసీఆర్ అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసులాంటోళ్లు
  • చీకటి ఒప్పందాలతో నన్ను ఓడించాలని కుట్ర
  • బండి సంజయ్ వ్యాఖ్యలు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొన్నం తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని చెప్పారు. పొన్నం వెధవ అంటే తన ద్రుష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’’ అని అర్ధమని చెప్పారు. ఓడిపోతామని తెలిసి ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాలతోపాటు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని వివరించి బీజేపీకి ఓటేయించాలని కోరారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇంటింటికీ పార్టీ పన్నా ప్రముఖ్ లు పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికీ 5 సార్లు వెళ్లి ఓట్లు అభ్యర్ధించడంతోపాటు తమ తమ పోలింగ్ బూత్ పరిధిలో 100 శాతం పోలింగ్ జరిగేలా క్రుషి చేయాలని సూచించారు. నూటికి నూరుశాతం ఓట్లు వేయించే పోలింగ్ బూత్ బాధ్యులను తాను స్వయంగా అభినందించడంతోపాటు సన్మానిస్తానని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం బోయినిపల్లి మండలానికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభతో కలిసి పార్టీ పన్నా ప్రముఖుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యాంశాలు.
దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఎన్నికల నాటికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ మూడు సార్లు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా అత్యధిక మెజారిటీతో గెలవడం ద్వారా కరీంనగర్ ప్రజా తీర్పును దేశానికి చాటి చెప్పి చరిత్ర స్రుష్టిద్దామని చెప్పారు.

మోదీ పాలనలో దేశాభివ్రుద్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీదే. ఈ విషయాలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. కమిట్ మెంట్ విషయంలో పన్నా ప్రముఖ్ లను మించినోళ్లు లేరు. క్రమశిక్షణతో ప్రతి ఇంటికీ వెళ్లి సంస్కారవంతంగా నమస్కరిస్తూ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధించాలి.

మొన్నటి దాకా బోయినిపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించింది. కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉంది. వత్తాసు పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆనాడు బైంసాలో దారుణాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. మొన్న చెంగిచర్లలో మహిళలను అవమానించారు. గర్భవతులపై, చిన్నారులపైనా దాడులు చేశారు. కార్యకర్తలెవరూ ఇక భయపడాల్సిన పనిలేదు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేను అండగా ఉన్నా. కేసీఆర్ పాలనలోనే ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా భయపడకుండా పోరాడానని, వందల కేసులు నమోదు చేసినా వెనుకంజ వేయలేదు. ప్రజలు పోరాడే వారి పక్షాన ఉంటారనడానికి ఎన్నికల ప్రచారంలో తనకు వస్తున్న మద్దతే ఇందుకు కారణం.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లడగవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా బీజేపీ నాయకులు, తాను చేసిన పోరాటాలను వివరించి గల్లా ఎగరేసుకుని ఓట్లడగండి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారని.. ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లు అడుగుతారో చెప్పాలి.

కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలుకాబోతున్నయ్. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోదీపట్ల సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోదీపట్ల, బీజేపీపట్ల సానుకూలంగా ఉన్నందున వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించాలని కోరారు. ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నరు. బీఆర్ఎస్ అభ్యర్ధి లేఖలు రాయడం, తాను చేసిన అభివ్రుధ్ధితోపాటు తెచ్చిన నిధులను తన ఖాతాలో వేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదు.. 10 ఏళ్లు అధికారంలో ఉంటూ కూడా కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తీసుకురాలేదు. నేను సేతు బంధన్ స్కీం కింద రూ.154 కోట్లు తెచ్చి ఆర్వోబీని నిర్మిస్తున్న. మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల విస్తరణ కోసం వేలాది కోట్లు నేను తీసుకొస్తే.. నా లేఖలవల్లే వచ్చాయని చెప్పడం సిగ్గుచేటు. కేసీఆర్ అనే నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వాళ్లు ఇక్కుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇద్దరూ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని నన్ను ఓడించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే దొంగ హామీలిస్తూ మోసం చేయాలని చూస్తున్నరు. వడ్లకు బోనస్ ఇవ్వడానికి, తరుగు, తాలుతో సంబంధం లేకుండా వడ్లు కొనడానికే డబ్బులు లేనోళ్లు..రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో రూ.30 లక్షల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మోదీ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి రాకపోతే రైతులకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేస్తారు..

మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కసుతో తనను వెధవ, రండ అంటూ బూతులు తిడుతున్నారు. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన వద్దకు పోవాలంటే ఆ పార్టీ కార్యకర్తలే భయపడుతున్నారు. అయినా పొన్నం తిట్లను నేను దీవెనలుగా భావిస్తున్నా. వెధవ అంటే ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’ అని భావిస్తున్నా. నేను చేసిన పోరాటాలతో బీజేపీ కార్యకర్తల గల్లా ఎగరేసుకునేలా చేసిన. కరీంనగర్ ప్రజలు వేసిన ఓటుకు విలువ తీసుకొచ్చానే తప్ప ఏనాడూ ఏసీల్లో కూర్చోలే,మీరున్నారనే ధైర్యంతో కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలే. దేశంలో ఏ ఎంపీపైనా లేనన్ని కేసులు నాపై పెట్టినా వెనుకంజ వేయకుండా ఫాంహజ్ లో ఉన్న కేసీఆర్ ను గల్లాపట్టి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నన్ను రెండు సార్లు జైలుకు పంపినా కేసీఆర్ గద్దె దిగే వరకు పోరాడిన చరిత్ర నాది కాబట్టి వాస్తవాలు ప్రజలకు వివరించి బీజేపీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular