Thursday, May 9, 2024

ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి

  • తెలంగాణలో 14 సీట్లు గెలిపించుకుంటాం
  • కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం
  • బెంగుళూరు లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని, తెలంగాణలో 17 సీట్లకు 14 సీట్లు గెలిపించుకుంటామని, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బెంగుళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. శనివారం బెంగుళూరు లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. బిజెపి అభ్యరి పిసి మోహన్ ను మూడుసార్లు గెలిపిస్తే బెంగుళూరుకు ఏం చేశారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో బెంగుళూరుకు కావాల్సిన నిధుల గురించి ఏనాడు అడగలేదన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు అడగడం లేదన్నారు.

కావేరీ జలాల వివాదం పరిష్కారం గురించి మాట్లాడలేదని, ఏ రోజైనా పిసి మోహన్ లోక్‌సభలో కర్ణాటక సమస్యల గురించి మాట్లాడారా..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. పల్లీ, బఠానీ తినడానికి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు పోవాల్సిన అవసరం లేదని, బెంగుళూరు బస్టాండ్ లో కూడా దొరుకుతాయని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో…
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ పదేళ్లలో 7లక్షల 21వేల 680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని బిజెపి నాయకులను సిఎం రేవంత్ ప్రశ్నించారు. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని, దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు మోడీకి ఓటు వేయాలా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా? అని ఆయన అన్నారు. మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు సరికదా, దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పించారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనం వెనక్కి రప్పించి జన్ ధన్ ఖాతాల్లో రూ. 15లక్షలు వేస్తామన్న మోడీ ఎవరి ఖాతాలో వేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ అంటేనే నమ్మించి మోసం చేయడం అని ఆయన అన్నారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బిజెపి నేతలను ఒక్కటే అడుగుతున్నా, యడ్యూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన కొడుకు విజయేంద్ర కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఆయన కొడుకు రాఘవేంద్ర ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని సిఎం రేవంత్ తెలిపారు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపి, గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుర్లు ఎంపిలు, రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆ పార్టీలో ఉన్నోళ్లంతా చేసేవి కుటుంబ రాజకీయాలేనని వారంతా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

బిజెపి నేతల అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే…
బిజెపి నేతలు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. దేవెగౌడ, ఆయన కుమారుడు దేశంలోనే అత్యంత అవినీతిపరులని, శాసనసభ ఎన్నికల్లో మోడీ అన్నారని, మరి ఈ ఎన్నికల్లో మోడీ వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. మోడీ ఈ అవినీతిపరులను పక్కనెలా కూర్చోబెట్టుకున్నారని సిఎం రేవంత్ ప్రశ్నిచారు. మోడీ చెప్పేదొకటి, చేసేదొకటని ఆయన అన్నారు. మోడీకి కావాల్సింది కేవలం ఎన్నికల్లో గెలవడమేనని, కర్ణాటక ప్రజల సంక్షేమం కాదని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని ఆయన అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా? నమ్మించి మోసం చేసే నమోకు ఓటు వేస్తారో ఆలోచన చేయాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.

యూపి, గుజరాత్‌లోనే సమర్థులు ఉన్నారా?
గుజరాత్‌కు 7 కేబినెట్ పదవులు.. యూపికి 12 కేబినెట్ పదవులు, కానీ 27 ఎంపిలను ఇచ్చిన కర్ణాటకకు కేవలం ఒక్క కేబినెట్ పదవి ఇచ్చారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. యూపి, గుజరాత్‌లోనే సమర్థులు ఉన్నారా? కర్ణాటక, తెలంగాణలో లేరా? ఇవి ఎన్నికలు కాదు రెండు పరివార్ ల మధ్య జరిగే యుద్ధమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈవిఎం, ఈడీ, ఇన్‌కంట్యాక్స్, సిబిఐ, ఆదానీ, అంబానీ అంతా మోడీ పరివార్ అని ఆయన ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డికె శివకుమార్ మా పరివార్ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 20 మంది ఎంపిలను గెలిపించాలని, మన్సూర్ అలీ ఖాన్‌కు మద్దతుగా నిలవాలని సిఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular